పోలవరం దుస్థితికి చంద్రబాబే కారణం
కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారని విమర్శలు
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబే పోలవరం దుస్థితికి కారణమంటూ ఏపి పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. చంద్రబాబు దోపిడీ వల్లే పోలవరం ప్రాజెక్టుకు నిధులు తగ్గాయని, కమీషన్ల కోసం కక్కుర్తిపడి చంద్రబాబు కాంట్రాక్టు తీసుకున్నారని తెలిపారు. ‘కేంద్రం అక్కర్లేదు మేమే కడతాం’ అని తీసుకున్నారని, పోలవరం ప్రాజెక్టును పాత లెక్కలకు ఒప్పుకుంది చంద్రబాబేనని స్పష్టం చేశారు. అయితే, కేంద్రాన్ని ఒప్పించి పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసేందుకు సిఎం జగన్ ప్రధాని మోడితో మాట్లాడతారని బొత్స పేర్కొన్నారు. కోర్టుకు వెళ్లకుండా సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నామని అన్నారు. పోలవరం విషయంలో రాజీపడేది లేదని తమ వైఖరిని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ కేంద్రం ఒప్పుకోకపోతే పోలవరం బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని అన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/