వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందిః మంత్రి బుగ్గన

జగన్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రంగంలో ప్రగతి దిశగా ముందుకెళ్తోందని వ్యాఖ్య

ap-is-number-one-in-ease-of-doing-business-says-minister-buggana-rajendranath-reddy-on-global-investors-summit

విశాఖః ఈరోజు ఉదయం ఏపిలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముందుగా ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. ఏపీలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని మంత్రి చెప్పారు. విశాఖలో కాస్మోపాలిటిన్ కల్చర్ ఉందని తెలిపారు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని వివరించారు. బిజినెస్‌ ఇండస్ట్రీలపై సీఎం జగన్‌ మంచి దార్శనికతతో ఉన్నారని.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ నంబర్‌వన్‌గా ఉందని తెలిపారు. వరుసగా మూడుసార్లు మొదటి స్థానం ఏపీదేనని తెలిపారు.

వనరులు, వసతులు, ఆయా ప్రాంతాల్లో ఉన్న అవకాశాలతోనే పారిశ్రామికాభివృద్ధి జరుగుతోందని, ఏపీలో వనరులు అపారంగా ఉన్నాయని, అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని బుగ్గన చెప్పారు. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని, నైపుణ్య మానవ వనరులకు రాష్ట్రం చిరునామాగా మారిందని తెలిపారు. పునరుత్పాదక శక్తి రంగంలో అవకాశాలకు సంబంధించి ఏపీకి పోటీనే లేదని మంత్రి బుగ్గన చెప్పుకొచ్చారు. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రంగంలో ప్రగతి దిశగా ముందడుగు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.