ఏపిలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్
ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలి..హైకోర్టు
అమరావతి: ఏపిలో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎస్ఈసీ అప్పీల్పై హైకోర్టులో రెండ్రోజుల క్రితం వాదనలు ముగియగా.. జడ్జిమెంట్ రిజర్వ్ చేసిన హైకోర్టు నేడు తీర్పునిచ్చింది. పంచాయతీ ఎన్నికలు కొనసాగించాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనని.. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమన్వయంతో ముందుకు సాగాలని హైకోర్టు సూచించింది. కాగా.. ఈనెల 8న ఎన్నికల షెడ్యూల్ను ఎస్ఈసీ ప్రకటించింది. దీంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారమే ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/