ఎస్ఈసీ ఆదేశాలను రద్దు చేసిన ఏపీ హైకోర్టు

ఏకగ్రీవాలైన చోట్ల డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు

అమరావతి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏపీ హైకోర్టు ఈరోజు కీలక తీర్పును వెలువరించింది. నామినేషన్ల సందర్భంగా బలవంతపు ఉపసంహరణలు, అడ్డగింతలపై విచారణ చేపట్టాలన్న ఎస్ఈసీ ఆదేశాలను కోర్టు రద్దు చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏకగ్రీవాలపై ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు అందాయి. దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ విచారణకు ఆదేశించారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు వేశారు.

ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు గతంలోనే మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఈరోజు తుది తీర్పును వెలువరించింది. ఏకగ్రీవాలపై ఫామ్-10 ఇచ్చిన స్థానాల్లో విచారించే అధికారం ఎస్ఈసీకి లేదన్న పిటిషనర్ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఎస్ఈసీ ఆదేశాలను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. ఏకగ్రీవాలైన చోట్ల డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/