పోలీసుల తీరుపై ఏపి హైకోర్టు తీవ్ర ఆగ్రహం
రాజధాని గ్రామాల్లో మహిళలను పోలీసులు కొట్టడంపై వివరణ అడిగిన న్యాయమూర్తి
అమరావతి: రాజధాని ప్రాంతం అమరావతిలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని ప్రాంతంలో ఆందోళన చేస్తున్న మహిళలపట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును హైకోర్టు ప్రశ్నించింది. విజయవాడ ర్యాలీలో పాల్గన్న 610 మందిని ఎందుకు అరెస్ట్ చేశారు ? ఐడీ కార్డులు ఎందుకు అడిగారు ? అని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. రాజధాని గ్రామాల్లో మహిళలను పోలీసులు కొట్టడంపై న్యాయమూర్తి వివరణ అడిగారు. రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ ఎప్పటి నుంచో అమల్లో ఉందని, కొత్తగా పెట్టలేదని ప్రభుత్వ తరపు న్యాయవాది సమాధాం ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్, పోలీసు యాక్ట్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుమారు గంటకు పైగా విచారణ జరిపిన హైకోర్టు… తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు రాజధాని ప్రాంతంలో మహిళను ఓ పోలీసు బూటుకాలితో తన్నడంపై కూడా ధర్మాసనం ప్రశ్నించింది. మరో మహిళ నోరును కూడా బలవంతంగా నొక్కారంటూ కొన్ని ఫొటోలు కూడా చూపించి ప్రశ్నించారు. వీటిపై ప్రమాణపత్రం సమర్పించడానికి అడ్వొకేట్ జనరల్ సమయం కోరడంతో… కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/