ఏపిలో మున్సిపల్‌ ఎన్నికలకు లైన్‌ క్లియర్‌

పాత నోటిఫికేషన్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు… హైకోర్టు స్పష్టీకరణ

అమరావతి: ఏపిలో మున్సిపల్‌ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పాత నోటిఫికేషన్ ప్రకారమే పురపాలక ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. షెడ్యూల్ లో పేర్కొన్న విధంగా మార్చి 10వ తేదీన పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టాలని తెలిపింది.

గతంలో అధికార పక్ష నేతలు తమను నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకున్నారంటూ జనసేన పార్టీతో పాటు పలువురు హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. పాత నోటిఫికేషన్ వచ్చి 11 నెలలు అయిందని, తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలని పిటిషన్లు వేశారు. అయితే పిటిషనర్ల వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ఎస్ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది. దాంతో రాష్ట్రంలో పురపాలక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం అయింది.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/