వైఎస్ఆర్సిపి సర్కార్పై హైకోర్టు ఆగ్రహాం
పార్లమెంట్ పై ప్రధాని ఫోటో ముద్రించారా, సుప్రీంకోర్టు పై ప్రధాన న్యాయమూర్తి ఫోటో ముద్రించారా ఇలాంటి సాంప్రదాయం ఎక్కడ ఉందో చూపించాలని వ్యాఖ్యానించింది.
అమరావతి: ఏపి హైకోర్టు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహాం వ్యక్తం చేసింది. పంచాయితీ కార్యాలయాలకు ప్రభుత్వం వైఎస్ఆర్సిపి రంగులు వేయడాన్ని హైకోర్టు ధర్మాసనం ఆక్షేపించింది. పంచాయితీ కార్యాలయాలపై వేసిన రంగులు, పార్టీ జెండాలు రంగులు వేర్వేరు అని ప్రభుత్వ తరపు న్యాయవాది న్యాయమూర్తికి వివరించారు. అయితే పార్టీ జెండాలను ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న రంగులను తాము పోల్చగలమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పంచాయితీ కార్యాలయాలపై సీఎం ఫోటోను ఎందుకు ముద్రించారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నారు కాబట్టే సీఎం ఫోటో ముద్రించారని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకి తెలిపారు.
అయితే న్యాయవాది వ్యాఖ్యలపై హైకోర్టు ధర్మాసనం సీరియస్ కామెంట్స్ చేసింది. పార్లమెంట్ పై ప్రధాని ఫోటో ముద్రించారా, సుప్రీంకోర్టు పై ప్రధాన న్యాయమూర్తి ఫోటో ముద్రించారా ఇలాంటి సాంప్రదాయం ఎక్కడ ఉందో చూపించాలని వ్యాఖ్యానించింది. పార్టీ జెండా గుర్తులను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ వచ్చిన తర్వాత మేం పంచాయితీలపై పార్టీ రంగులపై సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోగలమని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోర్టుకి తెలిపింది. ప్రస్తుతం ఈ విషయంలో తమకు ఎలాంటి అధికారం లేదని ఎన్నికల కమిషన్ తరపున న్యాయవాది కోర్టుకు వివరించారు. ఎన్నికల కమిషన్కు అధికారం లేనపుడు నిర్ణయం తామే వెల్లడిస్తామన్న ధర్మాసనం పేర్కొంది. దీనిపై విచారణ రేపటికి వాయిదా వేసింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/