జగన్ నిర్ణయం పట్ల నాయీ బ్రహ్మణులు హర్షం..

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల నాయీ బ్రహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాయీ బ్రాహ్మణులను, వారి సామాజికవర్గాన్ని కించపరిచే పదాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. మంగలి, మంగలోడా, బొచ్చుగొరిగేవాడా, మంగలిది, కొండ మంగలి తదితరాలను నాయీబ్రాహ్మణులను ఉద్దేశించి ఉపయోగిస్తే.. వారి మనోభావాలను గాయపరిచినట్టుగా పరిగణిస్తారు. అందుకు బాధ్యులైన వారిపై భారత శిక్షాస్పృతి 1860 కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి జీవో ఎంఎస్‌ 50 జారీ చేశారు. దీనిపట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాయీబ్రహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇతంటి సంచలన ఉత్తర్వులు జారీ చేసిన సీఎం జగన్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు. పలు ప్రాంతాల్లో జగన్‌ చిత్రపటానికి పాలతో అభిషేకించి.. జగన్‌ను కీర్తిస్తూ నినాదాలు చేశారు. జగన్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైందంటూ ఏపీ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం అభివర్ణించారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని నాయీ బ్రాహ్మణులకు జగనన్న చేదోడు పథకం అమలు చేస్తూ ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నదని తెలిపారు. తమ సామాజికవర్గాన్ని ఉన్నతంగా ఉంచేందుకు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని అన్నారు.