ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు

వరంగల్: విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలో దాదాపు ఒక గంట పాటు రైలుని నిలిపివేశారు. ఏపీ ఎక్స్‌ప్రెస్‌ ఎస్ 6 బోగీలో ఒక్కసారిగా పొగలు రావడంతో నెక్కొండ స్టేషన్‌లో డ్రైవర్ అప్రమత్తమై రైలును నిలిపివేశారు. ఒక్కసారిగా పొగలులు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ప్రయాణికులు రైల్లో నుంచి పరుగులు తీశారు.

రైల్వేస్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు కూడా భయంతో పరుగులు పెట్టారు. రైలు బ్రేకులు జాం కావడంతో పొగలు వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. గంట నుంచి నెక్కొండ స్టేషన్‌లోనే ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలును నిలిపివేసి తనిఖీలు చేస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై విచారణ చేస్తామని అధికారులు చెబుతున్నారు. రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు చెలరేగకుండా పొగలను ఆర్పివేశారు. ప్రస్తుతం రైళ్ల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/