ఏపీ లో ప్ర‌భుత్వ‌ ఉద్యోగుల ఆందోళ‌న‌లు

చ‌ర్చ‌ల‌కు పిలిచిన మంత్రుల క‌మిటీ
చ‌ర్చ‌ల‌కు రాబోమ‌ని చెప్పిన ఉద్యోగ సంఘాలు


అమరావతి : ఏపీలో ఉద్యోగుల ఆందోళ‌నలు కొన‌సాగుతున్నాయి. వైస్సార్సీపీ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు ఆందోళన చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప్రభుత్వానికి సమ్మె నోటీసు కూడా ఇచ్చారు. ఉద్యోగులు ఫిబ్ర‌వ‌రి– 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్న నేప‌థ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులకు మంత్రుల కమిటీ ఆహ్వానం పంపింది. అయితే, మంత్రుల కమిటీ భేటీకి కూడా వెళ్ల‌బోమ‌ని ఉద్యోగ సంఘాల నేతలు స్ప‌ష్టం చేశారు. పీఆర్సీ జీవోల రద్దుతో పాటు మిశ్రా కమిటీ నివేదికకు బహిర్గతం చేయాలని, పాత పద్ధతిలోనే జీతాలు ఇవ్వాలని, అలా అయితేనే చర్చలకు వెళ్తామని అంటున్నారు.

కాగా, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంఘాలు క‌లిపి పీఆర్సీ స్ట్రగుల్‌ కమిటీగా ఏర్పడినట్లు ఇప్ప‌టికే ఉద్యోగులు చెప్పారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ నేడు అన్ని జిల్లాల కేంద్రాల్లో ఉద్యోగులు ధ‌ర్నాలు చేస్తున్నారు. విజ‌య‌వాడ పాత బ‌స్టాండ్ నుంచి ధ‌ర్నా చౌక్ వ‌ర‌కు ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వ‌హించారు. పీఆర్సీకి సంబంధించి అధికారుల కమిటీ ఉద్యోగుల అభిప్రాయాలను, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే ప్ర‌భుత్వం జీవోలు జారీ చేసింద‌ని అంటున్నారు. ఈ జీవోలు జారీ చేయడంతో తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పారు. ఇప్ప‌టికే తాము నిరసన కార్యక్రమాలకు ప్రణాళికలు రచించామని తెలిపారు. నిరవధిక సమ్మెకు వెళ్తామ‌ని హెచ్చ‌రించారు. ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా వెన‌క్కి త‌గ్గి త‌మ గురించి ఆలోచించాల‌ని డిమాండ్ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/