అభ్యర్థులకు ఎవరూ అడ్డంకులు సృష్టించవద్దు
నామినేషన్లను అడ్డుకుంటే తీవ్రంగా పరిగణిస్తాం: ఎన్నికల కమిషనర్ రమేశ్
అమరావతి: ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైంది. ఈ నేపథ్యంలో పలువురు నేతలు అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ విషయం పై స్పందించిన ఎన్నికల కమిషనర్ రమేశ్ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం ఉదయం ఎన్నికల కమిషనర్ రమేశ్ మాట్లాడుతూ… ఎవరైనా నామినేషన్ను అడ్డుకుంటే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. పోటీచేసే అభ్యర్థులకు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టించవద్దన్నారు. చిత్తూరు జిల్లా సదుం మండలంలో జరిగిన ఘటనపై కేసు నమోదు చేశామని రమేశ్ వెల్లడించారు. నియమావళిని ఉల్లంఘించినట్టు ఎక్కడా ఫిర్యాదులు రాలేదని రమేశ్ వెల్లడించారు. చిత్తూరు జిల్లా ఘటన తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎన్నికల సమయంలో ఎవరు ఇబ్బంది కలిగించినా తీవ్రంగా పరిగణిస్తామన్నారు. సిబ్బందికి కొరత లేదని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ నుంచి తమకు సహకారం ఉందని రమేశ్ పేర్కొన్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/