ఆ రెండు బిల్లులు ఆమోదం పొందినట్లే..
ఏపి డిప్యూటీ సిఎం పిల్లి సుభాష్ చంద్రబోస్
అమరావతి: ఏపి అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ రెండు బిల్లులను మండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపుతామని ప్రకటించినప్పటికీ.. ఆ దిశగా ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ క్రమంలో ఏపీ రాజధాని బిల్లులపై ఏపి డిప్యూటీ సిఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులకు ఆమోదం లభించినట్లేనని ఆయన బాంబు పేల్చారు. 14 రోజులు ముగిసినందున ఆ రెండు బిల్లులు పాసైనట్లేనని అన్నారు. విచక్షణాధికారాన్ని ఎక్కడపడితే అక్కడ ఉపయోగించడం కుదరదని మండలి ఛైర్మన్పై విమర్శలు గుప్పించారు పిల్లి సుభాష్. రెండు బిల్లులు మండలిలోనే పెండింగ్లో ఉన్నాయన్న టిడిపి వాదనను పిల్లి సుభాష్ ఖండించారు. సభానుమతి కోరుతూ బిల్లులు ప్రవేశపెడితే.. వారికి ఉన్న అవకాశాలను వినియోగించుకోలేదని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు ఆమోదం పొందినట్లేనని స్పష్టం చేశారు. ఆ బిల్లులను త్వరలోనే గవర్నర్ ఆమోదం కోసం పంపిస్తామని చెప్పుకొచ్చారు పిల్లి సుభాష్ చంద్రబోస్.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/