భావి తరానికి భరోసా ఇవ్వాలి
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్
Vijayawada : నూతన లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు, కొత్త బాటలు వేసుకునేందుకు మనందరికీ ఇది ఒక సందర్భమని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు ఢిల్లీ మొదలు మారుమూల పల్లె వరకు కూడా ఎగిరే ప్రతి జాతీయ జెండా ఘనమైన, పటిష్టమైన రేపటికి ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలన్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం.. జాతీయ జెండా ఆవిష్కరించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ అధికారులకు సేవా పతకాలను సీఎం అందజేశారు. ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. హక్కులు అందరికీ సమానంగా అందాలన్నారు. పారదర్శక పాలన అందిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరిగేలా చూస్తున్నామని, 26 నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని సీఎం వైయస్ జగన్ అన్నారు. శాసనమండలి ప్రొటెం ఛైర్మన్ బాలసుబ్రమణ్యం, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్, మంత్రులు మేకతోటి సుచరిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, వెలంపల్లి శ్రీనివాస్, పలువురు ప్రజాప్రతినిధులు, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి సతీమణి శ్రీమతి వైయస్.భారతీ రెడ్డి కూడా హాజరయ్యారు.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/