మృతుల కుటుంబాలకు రూ. 5లక్షలు పరిహారం.. సీఎం జగన్‌

అమరావతి : భారీవర్షాల కారణంగా ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.5లక్షలు పరిహారం అందించాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గత మూడు రోజులుగా పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై శుక్రవారం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలని సూచించారు.రిజర్వాయర్లలో, చెరువుల్లో ఎప్పటికప్పుడు నీటిమట్టాలను గమనించుకుంటూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తిరుపతి, తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా స్థానికులు వారికి సహాయ, సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. వర్షాల వల్ల వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులకు గండ్లు పడినచోట తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సహాయ చర్యల కోసం ఆయా జిల్లాలకు అదనంగా నిధులు మంజూరు చేయాలని సీఎం స్పష్టం చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/