డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ నిధులు విడుదల
ఒంగోలు : సీఎం జగన్ శుక్రవారం ఒంగోలు పర్యటనకు వెళ్లారు. ఈసందర్బంగా జగన్ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డ్బాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీని విడుదల చేశారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సాధికారత సారధులకు అభినందనలు. తొలి ఏడాది సున్నా వడ్డీ కింద రూ.1258 కోట్లు చెల్లించాం. రెండో ఏడాది సున్నా వడ్డీ కింద రూ.1096 కోట్లు చెల్లించాం. వరుసగా మూడో ఏడాది రూ. 1261 కోట్లు చెల్లిస్తున్నామని అన్నారు. గడిచిన మూడేళ్లలో రూ.3165 కోట్లు అక్కాచెల్లెమ్మలకు చెల్లించాం. కోటి 2లక్షల 16 వేలమందికి పైగా అక్క చెల్లెమ్మలకు మేలు కలిగింది. గతంలో 12శాతం దాకా వడ్డీలు కట్టాల్సి వచ్చేది. అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని గత ప్రభుత్వం ఆలోచించలేదు. సున్నా వడ్డీ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసిన పరిస్థితులున్నాయి. కానీ మన ప్రభుత్వంలో ప్రతి ఏడాది మహిళలకు భరోసా ఇస్తున్నామని అన్నారు.
ఉచిత పథకాలతో ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందని టీడీపీ, జనసేన అంటున్నాయని చెప్పిన జగన్…ఆ రెండు పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. “మంచి పాలన అందిస్తున్న జగన్ పాలన వద్దట..ఉచిత పథకాల అమలుతో రాష్ట్రం శ్రీలంక అవుతోందట. చంద్రబాబులా మోసం చేస్తే రాష్ట్రం అమెరికా అవుతుందట. డబ్బు పంచే తమాషాలు ఇక ఆపాలట. పేదలకు పధకాలు ఇవ్వొద్దట. రోజూ దీనిపైనే ప్రచారం చేస్తున్నారు. బాబు పాలనే కావాలని దుష్ట చతుష్టయం అంటోంది. చంద్రబాబు దత్తపుత్తుడూ ఇదే అంటున్నాడు. ఇలాంటి రాక్షసులు, దుర్మార్గులతో మనం పోరాటం చేస్తున్నాం” అంటూ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/