విద్యుత్ రంగంపై సిఎం జగన్ సమీక్ష
విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూల విధానం
అమరావతి: ఏపి సిఎం జగన్ రాష్ట్ర విద్యుత్ రంగంపై అమరావతిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎనర్జీ ఎక్స్ పోర్ట్ పాలసీ తయారుచేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి అనుకూల విధానం ఉండాలని స్పష్టం చేశారు. విద్యుత్ విక్రయించే సంస్థలకు సానుకూల వాతావరణం కల్పించాలని సూచించారు. విద్యుత్ రంగంలో పెట్టుబడులు, మరిన్ని ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని సిఎం జగన్ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ప్లాంట్లు ఏర్పాటు చేసేవారికి అనుకూల విధానం ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో, లీజు ప్రాతిపదికన పరిశ్రమలకు భూములిచ్చే అంశంపైనా చర్చ జరిగింది. దీనివల్ల భూములిచ్చేవారికి మేలు జరుగుతుందని సిఎం అభిప్రాయపడ్డారు. ఏటా క్రమం తప్పకుండా ఆదాయం వస్తుందని, పైగా భూమి హక్కులు కూడా వారికే ఉంటాయని తెలిపారు.
తాజా ఆధ్యాత్మికం వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/devotional/