రేపు ఉదయం 5 గంటలకు ఫిలిం ఛాంబర్ కు సిరివెన్నెల పార్థివదేహం

లెజెండరీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఈ నెల 24న హైదరాబాద్ లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. ఐసీయూలో ఎక్మో సపోర్ట్‌తో ఉన్న ఆయన మంగళవారం సాయంత్రం 4:07 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ వార్త చిత్రసీమ ను శోక సంద్రంలో పడేసింది.

రాత్రి కిమ్స్‌ హాస్పటల్ లోనే ఆయన భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. రేపు ఉదయం 5 గంటలకు ఫిలిం ఛాంబర్ కు తీసుకురానున్నారు. ఇక సిరివెన్నెల లేరు అనే వార్త చిత్రసీమ తో పాటు యావత్ సినీ ప్రేక్షక లోకం తట్టుకోలేపోతుంది. ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ద్వారా విచారణ వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ సైతం ట్విట్టర్ ద్వారా సిరివెన్నెల కుటుంబ సబ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియపరిచారు.

తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల.. అని అన్నారు వైఎస్ జగన్. ‘తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను..’’ అని తెలిపారు.