ఇస్రో భవిష్యత్తులోనూ విజయవంతం కావాలని ఆకాంక్ష : సీఎం జగన్

పీఎస్ఎల్వీ తాజా విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన ఏపీ సీఎం జగన్

అమరావతి: శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఇస్రో నేడు నిర్వహించిన పీఎస్ఎల్వీ సి-52 ప్రయోగం విజయవంతం కావడం తెలిసిందే. దీనిపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. పీఎస్ఎల్వీ శ్రేణిలో చేపట్టిన తాజా ప్రయోగం సఫలం కావడం పట్ల ఆయన ఇస్రో శాస్త్రజ్ఞులను అభినందించారు.

అగ్రదేశాలకు దీటుగా భారత్ ను నిలపడంలో ఇస్రో కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల స్థాయిలో భారతదేశ అంతరిక్ష పరిశోధన సామర్థ్యాలను ఇస్రో మరింత ఇనుమడింపజేసిందని సీఎం జగన్ కొనియాడారు. ఇస్రో ఇకమీదట కూడా ప్రతి ప్రయోగంలోనూ విజయవంతం కావాలని అభిలషించారు. ఇస్రో ఇవాళ పీఎస్ఎల్వీ సి-52 రాకెట్ ద్వారా ఈఓఎస్-04, ఇన్ స్పైర్ శాట్-1, ఐఎన్ఎస్ 2టీ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది. కాగా, ఈ ఏడాది ఇస్రోకు ఇదే తొలి రాకెట్ ప్రయోగం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/