తక్షణమే ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలి

దుర్గారావు కుటుంబం నిలువ నీడ లేక రోడ్డున పడే పరిస్థితులు

Somu veerraju

అమరావతి: ఏపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఎస్ఐ దుర్గారావు మృతిపట్ల స్పందిస్తూ..ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘నిజాయతీ గల పోలీసు అధికారిని వెంటాడి, వేధించి అవినీతి ఆరోపణలతో మానసిక క్షోభకు గురి చేసి నిజాయితీపరుడికి ఈ భూమ్మీద చోటు లేదు అన్నట్లుగా ఎస్ఐ దుర్గారావు గారి మరణానికి కారణమయ్యారు’ అని సోము వీర్రాజు ఆరోపించారు.

’17 ఏళ్ల సర్వీసులో తన నిబద్ధతను చాటుకుంటూ పలువురి వద్ద ప్రశంసలు పొందిన అధికారికి పది ఛార్జి మెమోలు ఇచ్చి అవమాన పరిచారు. ఇలాంటి ఘటనల కారణంగా నిజాయితీతో పనిచేసే అధికారులు కూడా భయాందోళనలకు గురయ్యే అవకాశం ఉంది. పోలీస్ శాఖ పని తీరు ప్రశ్నార్థకంగా మారిన ఘటన ఇది’ అని సోము వీర్రాజు తెలిపారు. ‘బాసటగా నిలవాల్సిన సొంత పోలీసు అధికారులే మానసిక క్షోభకు గురిచేశారు అనే వాదనలు వినిపిస్తుండటం అత్యంత దయనీయం. నిజాయతీగా పని చేసిన సదరు అధికారి కుటుంబం నిలువ నీడ లేక రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడ్డాయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు. తక్షణమే ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలి నిజానిజాలు నిగ్గు తేల్చి, దోషులను కఠినంగా శిక్షించాలి’ అని సోము వీర్రాజు చెప్పారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/