ఈరోజు కూడా ఏపీ అసెంబ్లీ నుండి 11 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీ నుంచి ఆదివారం 11 మంది టీడీపీ సభ్యులను ఓ రోజు సస్పెన్షన్ చేసారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరవ రోజు ఆదివారం కొనసాగుతున్నాయి. వాయిదా తీర్మానం కోరుతూ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. పెరిగిన విద్యుత్ చార్జీలపై టీడీపీ వాయిదా తీర్మానం కోరింది. అయితే..సభ వాయిదాకు ముందే వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో టీడీపీ చేస్తున్న ఆందోళనల మధ్యే సభలో డిమాండ్స్ను మంత్రులు ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలోనే మోటర్లకు మీటర్లు.. రైతులకు ఉరితాళ్లు అంటూ ప్లకార్డులతో టీడీపీ నిరసన చేపట్టింది. రూ.6 వేల కోట్ల కుంభకోణం మోటర్లకు మీటర్లు అంటూ టీడీపీ ఆందోళన దిగింది. స్పీకర్ పోడియంను టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. కాసేపు అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ 11 మంది టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు సస్పెన్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు.

వ్యవసాయ మోటార్లకు మీటర్ల అంశంపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ విద్యుత్ మీటర్ల వల్ల 33 శాతం విద్యుత్ ఆదా అవుతుందని, శ్రీకాకుళంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు స్మార్ట్ మీటర్లు కాదు డిజిటల్ మీటర్లు మాత్రమేనని… పైలట్ ప్రాజెక్టుగా ఆ ప్రాంతంలో డిజిటల్ మీటర్లు బిగించామని వెల్లడించారు. మీటర్లు బిగించటం వల్ల దాదాపు 33 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఆదా అయ్యిందని.. వ్యవసాయ విద్యుత్ మీటర్ల వల్ల 33 శాతం విద్యుత్ ఆదా అయినట్టు తేలిందని వెల్లడించారు. టీడీపీ, కమ్యూనిస్టులు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. రాష్ట్రంలో 10 వేల మంది మినహా 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని తెలిపారు. రైతులకు 9 గంటల పగటి పూటే ఉచిత విద్యుత్ ఇస్తున్నామని.. కేవలం గృహ వినియోగదారులకు మాత్రమే స్మార్ట్ మీటర్లు పెట్టాలని భావిస్తున్నామన్నారు.