బాలీవుడ్​లో విషాదం.. ‘ఓం శాంతి ఓం’ నటుడు మృతి

‘ఓం శాంతి ఓం’ నటుడు నితీష్‌ పాండే (51) గుండెపోటుతో కన్నుమూశారు. మహారాష్ట్రలోని నాసిక్‌ సమీపంలోని ఇగత్‌పురిలోని ఓ హోటల్‌లో ఉన్న పాండే.. గుండెపోటుకు గురై అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హోటల్‌కి చేరుకుని పాండే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక పోలీసులు హోటల్‌ సిబ్బందితోపాటు, నితీష్‌ పాండేకు సన్నిహితంగా ఉండేవారిని విచారిస్తున్నారు.

మృతికి గల కారణలతో పాటు మరిన్ని విషయాలు పోస్ట్​ మార్టం రిపోర్టులో తేలనున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాలీవుడ్​కు చెందిన సినీ, టీవీ ప్రముఖులు నితేశ్ కు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. నితేశ్​ ‘ఏక్ ప్రేమ్ కహానీ’, ‘మంజిలీన్ అప్​నీ అప్​నీ’,’జస్టజూ’,’దుర్గేశ్’​, ‘నందిని’, అనుపమా వంటి సీరియల్స్​లో కీలక పాత్రలు పోషించి ఆడియన్స్​ను అలరించారు. ‘దబాంగ్​2’, ‘ఘాజీ’, ‘మేరీ యార్​ కీ షాదీ’, ‘ఓం శాంతి ఓం’ లాంటి సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఇక భర్త మృతి వార్త తెలిసిన అతని భార్య అర్పిత షాక్‌కి గురైంది. నితీష్‌పాండే బావ సిద్దార్త్‌ నగర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా బావ చనిపోయారని తెలిసి నా సోదరి అర్పిత షాక్‌లో ఉంది. ఇప్పటికీ బావ చనిపోయాడనేదాన్ని మేము నమ్మలేకపోతున్నాము.’ అని ఆయన అన్నారు.