ఢిల్లీలో ద‌లైలామా ప్ర‌తినిధితో అమెరికా మంత్రి భేటీ

నేటి సాయంత్రం ప్రధానితో సమావేశం

న్యూఢిల్లీ : అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ రెండ్రోజుల పర్యటన కోసం భారత్ కు వచ్చారు. ఈనేపథ్యంలోనే ఆంటోనీ బ్లింకెన్ ఇవాళ బౌద్ద ఆధ్యాత్మిక గురువు ద‌లైలామా ప్ర‌తినిధుల‌తో భేటీ అయ్యారు. ద‌లైలామా ప్ర‌తినిధి నోడుప్ డాంగ్‌చుంగ్‌తో అమెరికా మంత్రి భేటీ కావ‌డం ఒక‌ర‌కంగా చైనాకు ఆగ్ర‌హం తెప్పించే విష‌యంమే. నోడుప్‌తో అమెరికా మంత్రి భేటీపై చైనా విదేశాంగ శాఖ ఎటువంటి స్పంద‌న ఇవ్వ‌లేదు. చైనాలో టిబెట్ అంత‌ర్భాగ‌మ‌ని, ద‌లైలామా తీవ్ర‌మైన వేర్పాటువాది అని డ్రాగ‌న్ దేశం ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే.

మ‌రో వైపు మంత్రి బ్లింకెన్ ఇవాళ విదేశాంగ మంత్రి సుబ్ర‌మ‌ణియం జైశంక‌ర్‌ను క‌లిశారు. కోవిడ్ టీకాల స‌ర‌ఫ‌రా, ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ప‌రిస్థితి, దేశంలో మాన‌వ హ‌క్కుల అంశంపై ఇద్ద‌రు మంత్రులు చ‌ర్చించుకున్న‌ట్లు తెలుస్తోంది. రెండు దేశాల మ‌ధ్య బంధం కీల‌క‌మైంద‌ని బ్లింకెన్ తెలిపారు. ఈ రోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో బ్లింకెన్ సమావేశం కానున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/