అమెరికాలో ఆందోళనగా నిరసనలు
ట్రంప్ మద్దతుదారుడి మృతి
అమెరికా: అమెరికాలో నల్లజాతీయుడు జాకోబ్ బ్లేక్పై పోలీసుల కాల్పులకు నిరసనగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. బ్లేక్పై కాల్పులకు నిరసనగా పోర్ట్లాండ్లో ప్రజలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో ట్రంప్ మద్దతుదారులు ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తూ అటువైపు రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. పర్యవసానంగా ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన ట్రంప్ మద్దతుదారుడు ఒకరు మరణించారు. మరోవైపు, ఆందోళనల్లో మరణించిన వ్యక్తి తన మద్దుతుదారుడని తెలిసిన అధ్యక్షుడు ట్రంప్ డెమొక్రటిక్ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఆ పార్టీకి చెందిన పోర్ట్లాండ్ మేయర్ డెట్ వీలర్పై విరుచుకుపడ్డారు. జో బైడెన్, టెడ్ వీలర్ ఇద్దరూ దొందూదొందేనని విమర్శించారు. శాంతి భద్రతల్ని కాపాడడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. అవసరం అనుకుంటే బలగాల్ని రంగంలోకి దించుతామని హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యలపై డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ కూడా దీటుగా స్పందించారు. ట్రంపే హింసను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై వాహనశ్రేణితో దూసుకెళ్లడమే కాక, వారిని దేశభక్తులుగా అభివర్ణిస్తారా? అని మండిపడ్డారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/