వింతవ్యాధి..మరో ఇద్దరి మృతి

పరిస్థితి విషమంగా ఉన్న వారిని విజయవాడ తరలించిన అధికారులు

eluru- illness-case

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి బారినపడి చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3కి చేరింది. బాధితుల్లో 30 మందిని విజయవాడ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. వీరిని సుబ్బరావమ్మ (56), అప్పారావు (50)గా గుర్తించారు.

ఏలూరు వింతవ్యాధికి రక్తంలో సీసం, నికెల్ వంటి లోహాల అవశేషాలు పరిమితికి మించి ఉండడమే కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కలుషిత నీరు తాగడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇది గాలి ద్వారా వ్యాపించినది కాదని, ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటివరకు దాదాపు 600 మందికి ఈ వింత వ్యాధి సోకగా, 450 మందికి పైగా చికిత్స తరువాత డిశ్చార్జ్ అయ్యారు. పరిస్థితి విషమంగా ఉందని భావించిన కొందరిని మాత్రం మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/