మంగళ్హాట్ లో మరో బాలికపై అత్యాచారం
నిందితుడిని పట్టుకున్న స్థానికులు
హైదరాబాద్ : హైదరాబాద్లోని సైదాబాద్, సింగరేణి కాలనీలో తీవ్ర కలకలం రేపిన ఆరేళ్ల బాలిక హత్యోదంతం మరవకముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళ్హాట్ పరిధిలో ఓ బాలికపై అత్యాచారం జరిగింది. స్థానికంగా ఉండే ఓ యువకుడు అత్యాచారం చేసినట్లు బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు.
గత రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని వివరించారు. బాలిక అరుపులు పెట్టడంతో ఘటనాస్థలికి చేరుకున్న స్థానికులు సుమిత్ అనే యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సుమిత్పై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి.
హబీబ్ నగర్ పరిధిలో జరిగిన ఓ చోరీ కేసులోనూ అతడు నిందితుడిగా ఉన్నాడు. బాలిక నివసించే ప్రాంతానికి పోలీసులతో కలిసి చేరుకున్న ఏసీపీ నరేందర్ రెడ్డి అత్యాచార ఘటనపై విచారణ జరుపుతున్నారు. మొదట బాలికను భరోసా కేంద్రానికి తరలించి, అక్కడి నుంచి వైద్య పరీక్షల కోసం కోఠి ఆసుపత్రికి పోలీసులు తరలించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/