హైదరాబాద్ లో మరో ప్రేమ వ్యవహారం..యువకుడి ప్రాణాలు పోయేలా చేసింది

రీసెంట్ గా నవీన్ హత్య వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలియంది కాదు..ప్రేమ మోజులో ప్రాణ స్నేహితుడినే చంపేలా చేసింది. ఈ ఘటన కు సంబంధించి కేసు కొనసాగుతుండగానే మరో ప్రేమ వ్యవహారం మరో యువకుడి ప్రాణాలు పోయేలా చేసింది.

వివరాల్లోకి వెళ్తే..

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ ప్రాంతానికి చెందిన డెగావత్ పవన్ (22) కుటుంబ సభ్యులు గత 20 ఏళ్ల కిందటే నగరంలోని షాహిన్ నగర్ కు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. అతని కుటుంబ సభ్యులు స్థానికంగా పని చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే పవన్ నగరంలోని ఓ కాలేజీలో డిగ్రీ చదివేవాడు. ఈ క్రమంలోనే ఇతనికి మరో వర్గానికి చెందిన యువతి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా కొంత కాలం పాటు పవన్ ఆ యువతితో తిరుగుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో పవన్ వ్యవహారం గతంలో ఆ యువతి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో ఆ యువతి కుటుంబ సభ్యులు పవన్ ను బెదిరించి వార్నింగ్ ఇచ్చారు. దీనిపై ఇరు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కూడా జరిగాయి. ఇదిలా ఉంటే బుధవారం మరోసారి పవన్, అతని ప్రియురాలి కుటుంబ సభ్యుల మధ్య డబ్బుల విషయంపై గొడవ జరిగింది. ఇదిలా ఉంటే.. అయితే అదే రోజు రాత్రి కొందరు దుండగులు పవన్ ను హత్య చేయాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే పవన్ ఇంటికి వచ్చి అతని రాక కోసం ఎదురు చూశారు. ఇక అర్థరాత్రి పవన్ మూత్రం కోసమని బయటకు రావడంతో.. కాపుకాసి పవన్ సింగ్ ను ఆ దుండగులు కత్తులతో దారుణంగా హత్య చేసి పరారయ్యారు. వెంటనే స్పందించిన పవన్ కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ, ఫలితం లేకపోవడంతో పవన్ మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.