హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు

హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు నగరవాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. మొన్నటి మొన్న నల్లగుట్ట లోని డెక్కన్ షో రూమ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగి , ముగ్గుర్ని బలి తీసుకుంది. ఈ ఘటన గురించి ఇంకా నగరవాసులు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇక నిన్న రాత్రి నాంపల్లిలోని నుమాయిష్ ఎగ్జిబిషన్ పార్కింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవిచింది. కాగా.. మళ్లీ ఈరోజు హకీంపేటలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. హకీంపేట్ సాలార్జంగ్ బ్రిడ్జ్ ఏరియాలో వరుసగా గ్యాస్ సిలిండర్లు పేలాయి.

వెల్డింగ్ వర్క్ నడుస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఐదు సిలిండర్లు పేలడంతో పెద్ద ఎత్తున శబ్దంతో పాటు భారీగా మంటలు చెలరేగాయి. పెద్దఎత్తున ఎగిసిపడిన మంటలు చూసి.. స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురై అక్కడ నుంచి పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశాయి. అయితే.. ఎల్పీజీ సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లకు గ్యాస్ నింపుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దుకాణం మొత్తం దగ్ధమైంది. అప్పటికే ఫైర్ ఇంజిన్ వెంటనే రావటంతో పెద్ద ప్రమాదమే తప్పింది.