శిల్ప బాధితుల్లో మహేష్ ఫ్యామిలీ

అధిక వడ్డీ ఆశ చూపి సినీ ప్రముఖులను , వ్యాపారస్తులను మోసం చేసిన కిలాడీ లేడీ శిల్పా చౌదరి లీలలు రోజుకొకటి బయటకువస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటుడు మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని నుంచి రూ. 2 కోట్లకు పైగా నగదు తీసుకుని మోసం చేసినట్టు బయటపడింది. శిల్ప బాధితుల్లో ఎక్కువ మంది ప్రముఖులే ఉన్నట్లు చెప్తున్నారు పోలీసులు. తమకు రావల్సిన 40 కోట్ల రూపాయల ఇప్పించాలని సైబరాబాద్ పోలీసుల వెంటపడ్తున్నారు ప్రముఖులు. ప్రియదర్శిని ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

హైదరాబాద్ శివారు ప్రాంతం నార్సింగ్‌ మున్సిపాలిటీ గండిపేట సిగ్నేచర్ విల్లా లో నివాసముంటున్న చౌదరి అనే మహిళ గత కొన్నాళ్లుగా గండిపేట, కోకాపేట, మణికొండ, పుప్పాలగూడ, జూబ్లీహిల్స్, విజయవాడ, కర్నూలు, ఇతర ప్రాంతాలకు చెందిన సంపన్న కుటుంబాల్లోని మహిళలతో కిట్టి పార్టీల ఏర్పాటు చేసింది. అక్కడికి వారిని ఆహ్వానించి వారితో పరిచయం చేసుకుని తాను సినీ ఫీల్డ్ లో ప్రొడ్యూసర్ నంటూ నమ్మబలికి వారి నుంచి విరివిగా ఒక్కొక్కరి వద్ద కోటి రూపాయల నుంచి ఐదు కోట్ల వరకు డబ్బులు తీసుకొని గత కొన్ని రోజులుగా తప్పించుకు తిరుగుతోంది.

డబ్బుల కోసమే ప్రతి వీకెండ్‌లో కిట్టిపార్టీలు శిల్ప ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు నార్సింగ్ పీఎస్‌లోనే శిల్పా చౌదరిపై మూడు కేసులు నమోదయ్యాయి. అయితే చాలామంది టాలీవుడ్ ప్రముఖులు శిల్ప వలలో పడినట్లు తెలుస్తోంది. కానీ ఆ వివరాలేవి బయటకు రావడం లేదు. పోలీసులను ఆశ్రయిస్తే తమ పరువుకు ఎక్కడ భంగం కలుగుతుందోనని మిన్నకుండిపోతున్నట్లు సమాచారం.