అన్నవరం దేవస్థానం కీలక నిర్ణయం

అన్నవరం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అరటిఆకులో కాకుండా కంచాల్లోనే అన్నదానం చేయాలనీ నిర్ణయం తీసుకుంది. 35 ఏళ్ల క్రితం దేవస్థానంలో నిత్యాన్నదానం ప్రారంభం కాగా అప్పటి నుంచి భక్తులకు అరిటాకుల్లోనే అన్నప్రసాదం అందిస్తున్నారు. అయితే, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అరిటాకుల స్థానంలో కంచాలు తీసుకురావాలని, నేటి నుంచి అది అమలు చేయాలని నిర్ణయించారు.

అరిటాకుల లభ్యత అంతంత మాత్రమే కావడంతోపాటు ఖర్చు తగ్గించుకునే ఉద్దేశంతో కూడా అరిటాకుల స్థానంలో కంచాలు తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. అలాగే, బఫే పద్ధతిలోనే అన్న ప్రసాద వితరణ చేయాలని నిర్ణయించారు. అయితే, హాలు సిద్ధం కాకపోవడం, క్యూ లైన్ల పనులు పూర్తి కాకపోవడంతో ప్రస్తుతానికి బఫే పద్ధతిని వాయిదా వేశారు.