వకీల్ సాబ్ హీరోయిన్‌కు కరోనా.. తూచ్ అంటోన్న బ్యూటీ!

టాలీవుడ్‌లో మరికొద్ది గంటల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. కాగా పవన్ బొమ్మ పడి మూడేళ్లు దాటడంతో, ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ కూడా రెడీ అవుతున్నారు. అయితే ఈ సమయంలో వకీల్ సాబ్ చిత్రంలో నటిస్తున్న హీరోయిన్లకు వరుసగా కరోనా సోకిందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇటీవల నటి నివేధా థామస్‌కు కరోనా సోకిందని, దీంతో ఆమె క్వారెంటైన్‌లో ఉంటుందని తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. కాగా ఇటీవల వకీల్ సాబ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన బ్యూటీ అంజలికి తాజాగా కరోనా సోకిందని, ఆమె కూడా వెంటనే క్వారెంటైన్‌లోకి వెళ్లిపోయిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఈ వార్త గురించి తెలుసుకున్న అంజలి, తనకు కరోనా పాజిటివ్ లేదని, తాను బాగానే ఉన్నానంటూ చెప్పుకొచ్చింది.

ఇలాంటి రూమర్లను దయచేసి నమ్మొద్దంటూ తన అభిమానులకు సూచించింది. ఇక వకీల్ సాబ్ చిత్రం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని, ఈ సినిమాలో పవన్‌తో కలిసి పనిచేయడం తనకు సంతోషాన్ని కలిగించిందని అంజలి ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెప్పుకొచ్చింది. మొత్తానికి వకీల్ సాబ్ చిత్రం ఎంత ఫేమస్ అవుతుందో, ఆ సినిమా హీరోయిన్లకు కరోనా సోకిందనే వార్త కూడా అంతే పాపులర్ అవుతోంది.