రేపు ఢిల్లీ వెళ్లనున్న వైఎస్‌ఆర్‌సిపి ఎంపీలు

రఘురామకృష్ణరాజు అంశంపై స్పీకర్ తో సమావేశం

YSR Congress Party
YSR Congress Party

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ఎంపీలు రేపు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళుతున్నారు. వారు స్పీకర్ ఓం బిర్లాతో సమావేశం కానున్నారు. రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలంటూ వారు స్పీకర్ ను కోరనున్నారు. అనేక అంశాల నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సిపి అధినాయకత్వం రఘురామకృష్ణరాజుపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే ఆయనకు షోకాజ్ నోటీసులు కూడా పంపారు. సంజాయిషీ ఇవ్వకపోగా, ఆ షోకాజ్ నోటీసులనే ప్రశ్నించడం ద్వారా రఘురామకృష్ణరాజు మరింత ఆజ్యం పోశారు. వైఎస్‌ఆర్‌సిపి హైకమాండ్ దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీకి దూరం కావాలన్న ఉద్దేశంతోనే రఘురామకృష్ణరాజు ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్నది వైఎస్‌ఆర్‌సిపి నేతల ఆరోపణ. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన నరసాపురం ఎంపీ ఇప్పటికే ఢిల్లీ వెళ్లి స్పీకర్ ను, పలువురు కేంద్ర మంత్రులను కలిసి తన వాదనలు వినిపించారు. రేపు వైఎస్‌ఆర్‌సిపి ఎంపీలు కూడా స్పీకర్ ను కలవనుండడంతో ఈ అంశంలో మరింత ఆసక్తి ఏర్పడింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/