ఈనెల 26న నవ రత్నాల అప్గ్రేడెడ్ వెర్షన్
ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న వైసీపీ..ఈ నెల 26 న పార్టీ మేనిఫెస్టో ను రిలీజ్ చేయబోతుంది. ఇప్పటికే జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టారు. ఈరోజు తో బస్సు యాత్ర పూర్తి అవుతుంది. రేపు కడప లో తన నామినేషన్ వేయనున్నారు. ఎల్లుండి తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలోలో మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న వాటిపై జగన్ మేనిఫెస్టోలో క్లారిటీ ఇవ్వనున్నారు. ఆచరణ సాధ్యమయ్యే అంశాలతోనే మేనిఫెస్టో రూపొందించామని చెబుతున్నారు వైసీపీ నేతలు. మహిళలు, యువత, రైతులే టార్గెట్గా మేనిఫెస్టో ఉంటుందని దాంతో పాటూ పలు జనాకర్షణ పథకాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈసారి వైసీపీ మేనిఫెస్టోలో నవరత్నాలకు అప్గ్రేడెడ్ వెర్షన్ ఉండొచ్చని తెలుస్తోంది. గత ఎన్నికల్లో నవ రత్నాల పేరుతో సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పారు. దాదాపు వాటన్నింటినీ చేశారు కూడా. అందుకే ఈసారి వాటి అప్గ్రేడెడ్ వెర్షన్తో జగన్ ప్రజల ముందుకు వస్తారని అంటున్నారు. ఇందులో భాగంగా రైతులు, కార్మికులు, మహిళలు, అవ్వాతాతలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో పాటూ మౌలిక సదుపాయాల కల్పనపై హామీలను మ్యానిఫెస్టోలో చేర్చే అవకాశాలున్నాయంటున్నారు. ఇప్పటికే టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో తమ మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆకట్టుకుంటుంది. ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉంటుందో అని ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.