జగన్పై యనమల కీలక ఆరోపణలు
కోన ప్రాంతాన్ని కబలించాలనేది జగన్ 14 ఏళ్ల కల
అమరావతి: టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సిఎం జగన్పై కీలక ఆరోపణలు చేశారు. కాకినాడ సెజ్ పై జగన్ కన్నేయడం ఇప్పుడు కొత్తగా జరిగింది కాదని… కోన ప్రాంతాన్ని కబలించాలనేది ఆయన 14 ఏళ్ల కల అని అన్నారు. తన తండ్రి వైయస్ సీఎంగా ఉన్నప్పుడు ఆ పని జరగకుండా టిడిపి అడ్డుకుందని జగన్ కక్షకట్టారని చెప్పారు. ఇప్పుడు సిఎం కాగానే బినామీ సంస్థలతో కోనా ప్రాంతాన్ని కొట్టేస్తున్నారని అన్నారు. సీబీఐ చార్జిషీట్లలో ఉన్న సహనిందితులే బినామీలుగా భూఆక్రమణలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బినామీ ఆయన అల్లుడు రోహిత్ రెడ్డేనని యనమల ఆరోపించారు. వైయస్ హయాంలో జరగిన భూమాయ ఇప్పుడు మళ్లీ జరుగుతోందని అన్నారు. తండ్రి, కుమారుల చేతిలో బాధితులుగా మారింది కోన రైతాంగమేనని చెప్పారు. భూముల యజమానులైన రైతుల నోళ్లలో మట్టి కొట్టడం దారుణమని అన్నారు. కాకినాడ సెజ్ విక్రయాల వల్ల రూ. 4,700 కోట్ల లాభం వచ్చిందని… అందులో సగం స్థానిక రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాకినాడ సెజ్ లో బల్క్ డ్రగ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తే కోన ప్రాంతం కాలుష్య ప్రాంతంగా మారుతుందని చెప్పారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/