ఐటీ దాడుల సాకుతో టిడిపిపై దుష్ప్రచారం
వైఎస్సార్సిపి నేతలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం
అమరావతి: ఐటీ దాడుల సాకుతో వైఎస్సార్సిపి నేతలు టిడిపిపై దుష్ప్రచారం చేస్తున్నారని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఇలాంటి ప్రచారం మానుకోకపోతే వైఎస్సార్సిపి నేతలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. పిఏలు, పిఎస్లకు పార్టీకి సంబంధం ఏం ఉంటుందని ఆయన ప్రశ్నించారు. పిఎస్ శ్రీనివాస్కు టిడిపితో ఏం సంబంధం ఉంటుందని..అతనొక ప్రభుత్వ అధికారి మాత్రమే అని అన్నారు. ఆయనపై ఐటీ దాడులు పూర్తిగా వ్యక్తిగతమని..వాటిని టిడిపికి ముడిపెట్టడం కావాలని బురద జల్లడమే అని యనమల ఆరోపించారు. 40 ఏళ్ల చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్రలో 10-15 మంది పిఎస్లు, పిఏలు పని చేశారని యనమల తెలిపారు. దేశవ్యాప్తంగా 40 చోట్ల దాడులకు టిడిపికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. అక్రమాస్తుల కేసుల నుంచి తప్పించుకోవడం, ఎదుటివాళ్లపై దాడులు చేయడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/