నన్ను చంపాల్సిన అవసరం ఏమొచ్చిందో

అఖిలప్రియపై మరోసారి మండిపడ్డ ఏవీ సుబ్బారెడ్డి

av-subbareddy

కర్నూల్‌: ఏపి మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై టిడిపి సీనియర్‌ నేత, ఏవీ సుబ్బారెడ్డి మరోసారి మండిపడ్డారు. ఈ రోజు ఆయన తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ఆళ్లగడ్డ తన అడ్డా అనే భావనలో అఖిల ఉన్నదని, ఆమెకు తప్ప భూమా కుటుంబంలో ఎవరికి పగ్గాలు ఇచ్చినా సంతోషంగా ఉంటుందన్నారు. ఆమెకు ఎమ్మెల్యే, మంత్రి పదవులు ఊరికే రాలేదని, తామంతా కష్టపడితే ఆమెకు ఆ స్థానం దక్కిందన్నారు. తమపై బాంబుల దాడి జరిగితే, ఆ దాడి నుంచి క్షేమంగా తప్పించుకున్నామని ఆ నాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు. ప్రత్యర్థులతో పోరాడటంపై తనకు అఖిలప్రియ చెబుతున్నారని ఏవీ వ్యాఖ్యానించారు. తనకు భయం లేదని, తనను తాను కాపాడుకోగలనని చెప్పారు. తాను 35 ఏళ్లుగా ఫ్యాక్షన్‌ ఫీల్డ్‌లో ఉన్నానని, దాన్ని వదిలేశాను కాబట్టే ఇప్పుడు ఒంటరిగా తిరుగుతున్నానని వ్యాఖ్యానించారు. తాను ఆళ్లగడ్డలో తప్పకుండా రాజకీయం చేస్తానని, తనకు అఖిలప్రియ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.

తనను హత్య చేయించేందుకు భూమా అఖిలప్రియ దంపతులే సుపారీ ఇచ్చారని, ఈ విషయాన్ని పోలీసులు చెప్పగా విని షాక్‌ అయ్యానని అన్నారు. తనపై దాడి జరిగిన తర్వాత రెండున్నర నెలలు మౌనంగా ఉన్నానని చెప్పారు. అఖిలప్రియపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, తనపై ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా తనను ఆమె ఆళ్లగడ్డ రమ్మంటోందన్నారు. తనను చంపించాల్సిన అవసరం అఖిలప్రియకు ఏముందని సుబ్బారెడ్డి ప్రశ్నించారు. తన మిత్రుడు భూమా నాగిరెడ్డితో తనకున్న అనుబంధం గురించి ఆళ్లగడ్డలో స్థానిక నేతలను అడిగితే తెలుస్తుందన్నారు. భూమా నాగిరెడ్డి కుటుంబానికి 30 ఏళ్లు అండగా ఉన్నానని చెప్పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/