మరోసారి వైఎస్‌ఆర్‌సిపిపై ఆగ్రహం

సవాల్ విసురుతున్నా ..కావాలంటే బహిష్కరించి చూడండి

YSRCP MP Raghurama Krishnam Raju

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై ఎంపి రఘురామకృష్ణరాజు మరోసారి మండిపడ్డారు. తనపై అనర్హత వేటు వేయాలని ఎంపి మిథున్ రెడ్డి మళ్లీ కోరుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగంలోని షెడ్యూల్ 10ని ఓసారి చదువుకోవాలని తమ పార్టీ ఎంపిలకు సూచిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పనుల గురించి ఏనాడైనా మిథున్ రెడ్డి మాట్లాడాడా? అని రఘురామ ప్రశ్నించారు. లోక్ సభా పక్ష నేత ఎన్నిక జరిపితే మిథున్ రెడ్డికి 3 ఓట్లకు మించి రావని స్పష్టం చేశారు. మిథున్ రెడ్డిపై చాలామంది ఎంపీలకు అసంతృప్తి ఉందని అన్నారు. తనను పార్టీ నుంచి బహిష్కరించినా, పార్లమెంటులో కమిటీ చైర్మన్ గా కొనసాగుతానని స్పష్టం చేశారు. సవాల్ విసురుతున్నా… కావాలంటే బహిష్కరించి చూడండి అంటూ తీవ్రంగా స్పందించారు. ఎలాగైనా తానే కమిటీ చైర్మన్ గా కొనసాగుతానని తెలిపారు. చట్ట ప్రకారం నాపై అనర్హత వేటు వేయడం మీ వల్ల కాదు అని పేర్కొన్నారు. ఈ కమిటీ చైర్మన్ పదవి తన వాక్పటిమ కారణంగా సాధించుకున్నానని ఉద్ఘాటించారు. పదవులన్నీ మీ కులస్తులకేనా? అని ప్రశ్నించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/