కొనసాగుతున్న వందేభారత్‌ మిషన్‌- 2

కువైట్ నుంచి మొత్తం 300 మంది రాక.. మలేసియా నుంచి 62 మంది

Second phase of Vande Bharat Mission

విజయవాడ: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వందేభారత్‌ మిషన్‌ రెండో దశ కొనసాగుతుంది. ఇందులో భాగంగా కువైట్‌లో చిక్కుకున్న 150 మంది కార్మికులు నిన్న గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో వీరందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక బస్సుల్లో గూడవల్లి సమీపంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

అంతకుముందు కువైట్ నుంచి హైదరాబాద్ చేరుకున్న 150 మంది ప్రవాసాంధ్రులలో ఒకరు తప్ప మిగతా వారందరూ నిన్న వేకువజామున రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. స్క్రీనింగ్ పరీక్షల అనంతరం కడప జిల్లాకు చెందిన116 మందిని, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆరుగురిని, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఐదుగురిని, విశాఖ జిల్లాకు చెందిన నలుగురిని, నెల్లూరు జిల్లాకు చెందిన ఆరుగురిని, కృష్ణా జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని ఆయా జిల్లాల్లోని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించగా, మిగిలిన వారిని తిరుపతిలోని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. వీరిలో చిత్తూరు జిల్లాకు చెందిన ఏడుగురు, చెన్నైకి చెందిన ఒకరు, కర్నూలుకు చెందిన ఒకరు, అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు ఉన్నారు. రాత్రి 11 గంటలకు మలేసియా నుంచి 62 మంది విశాఖపట్టణం విమానాశ్రయానికి చేరుకున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/