వికేంద్రీకరణ బిల్లుకు మండలిలో అడ్డంకి
అమరావతి: ఏపి శాసన మండలిలో వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన ప్రవేశ పెట్టారు. అయితే దీనిని టిడిపి సభ్యులు అడ్డుకున్నారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ టిడిపి రూల్ 71 మోషన్ కింద నోటీసు ఇచ్చింది. బిల్లును ప్రవేశపెట్టే ముందు తామిచ్చిన నోటీసుపై చర్చ జరపాలని మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. మండలిని కించపరిచే విధంగా మంత్రి బొత్స వ్యాఖ్యానించారని, మండలికి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందిందని, చర్చ జరగాల్సిందేనని బుగ్గన స్పష్టం చేశారు. రూల్ 71 కింద బిల్లును తిరస్కరించే అధికారం మండలికి లేదని ఆయన పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మండలి చైర్మన్ రూల్ 71 నోటీసుపై చర్చకు అనుమతిచ్చారు. దీంతో మండలిలో వికేంద్రీకరణ బిల్లు తాత్కాలికంగా ఆగిపోయింది. అయితే మండలిలో బిల్లు పెట్టి అది వీగిపోతే డిమ్డ్ టూ పాస్డ్ కింద ప్రభుత్వానికి ఆమోదం చేసుకునే అవకాశం ఉంటుంది. అసలు బిల్లే పెట్టకపోతే డిమ్డ్ టూ బీ పాస్డ్ కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/