ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండచరియలు

వర్షాల కారణంగా విరిగిపడిన కొండచరియలు

Landslide-at-Indrakeeladri

విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. వర్షాలకు బాగా నానిపోవడంతో మట్టి కరిగిపోయి పెద్ద బండరాళ్లు, మట్టి కిందికి పడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చిక్సిత్స అందిస్తున్నారు. కొండ చరియలు విరిగిపడటంతో ఓ రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ప్రస్తుతం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.

కాగా సిఎం జగన్‌ ఈ సాయంత్రం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉండగా, అందుకు కొన్ని గంటల ముందు ఈ ఘటన జరిగింది. సిఎం పర్యటన నేపథ్యంలో ఈ కొండచరియలు విరిగిపడడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. సిఎం జగన్ వస్తున్నారన్న కారణంతో భక్తుల రాకను తాత్కాలికంగా నిలిపివేశారు. లేకుంటే భారీ నష్టం జరిగి ఉండేదన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కాగా, ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు, ఇతర అధికారులు కొండచరియలను తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మీడియా పాయింట్ కు సమీపంలోనే ఈ కొండచరియలు విరిగిపడినట్టు తెలుస్తోంది.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/