అంతర్వేదిలో భారీగా పోలీసుల భద్రత
గృహనిర్బంధంలోకి బిజెపి, జనసేన నేతలు
అంతర్వేది: తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు చలో అంతర్వేదికి బిజెపి, జనసేన పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అంతర్వేదిలోని లక్ష్మి నరసింహ ఆలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున అంతర్వేదిలోనికి ఎవరినీ రానీయడం లేదు. ఇప్పటికే పలువురు బిజెపి, జనసేన నేతలను అదుపులోకి తీసుకొని నిర్బంధించారు. కొత్తపేటలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలూరు సత్యానందం, రావులపాలెంలో బిజెపి గుంటూరుజిల్లా పదాధిపతి రామకృష్ణారెడ్డిలను గృహనిర్బంధం చేశారు. ఇక నిన్న చలో అంతర్వేది కార్యక్రమంలో పాల్గొన్న 40 మందికి పైగా నేతలపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని ఏలూరు రేంజ్ డీఐజీ వెల్లడించారు. ఫోరెన్సిక్ విభాగానికి చెందిన నిపుణులు ఘటనాస్థలంలో అణువణువు నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/