మండలిలో నిబంధనలు ఉల్లంఘించారు
అభివృద్ధి నిరోధకమైన మండలిని రద్దు చేయాలన్నదే మా ఆలోచన
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో శాసనమండలి రద్దుకు వైస్సార్సిపి సర్కారు సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ..మండలిలో నిబంధనలు ఉల్లంఘించి బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించారని ఆరోపించారు. అభివృద్ధి నిరోధకమైన మండలిని రద్దు చేయాలన్నదే తమ ఆలోచన అని అన్నారు. శాసనమండలిని నాడు వైఎస్సార్ పునరుద్ధరించినా, దాన్ని రద్దు చేయాలా? వద్దా? అనేది ప్రభుత్వ విచక్షణ అని తెలిపారు. వైఎస్సార్ గతంలో జాతీయ పార్టీలో ఉంటూ సీఎంగా పనిచేశారని, అందువల్ల అధిష్ఠానం ఒత్తిళ్లతో అప్పట్లో కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చని వివరించారు. ఇంకా రాజధాని మార్పు అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిదేనని ఉద్ఘాటించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ లేదని అంబటి తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/