అమరావతిలో అన్నీ ఉన్నాయి.. మార్చకండి
తనపై కోపాన్ని రాజధానిపై చూపించవద్దన్న చంద్రబాబు
విజయవాడ: ప్రపంచవ్యాప్తంగా నాగరికత వెలసింది నదుల పక్కనేనని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. విజయవాడలో గద్దె రామ్మోహన్రావు చేపట్టిన దీక్షకు చంద్రబాబు మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనపై కోపం ఉంటే అది తనమీదే చూపించాలని, అమరావతిపై చూపించకండి అని అన్నారు. రాజధానిపై సిఎం, మంత్రులు రోజుకు ఒకలా మాట్లాడుతున్నారిని ఆయన విమర్శించారు. రాజధానిలో అన్ని భవనాలు ఉన్నాయి, అక్కడ పైసా ఖర్చు చేయనవసరం లేదు అని చంద్రబాబు సూచించారు. అన్ని ప్రాంతాల వారు కూడా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతున్నారని ఆయన అన్నారు. విశాఖ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు చాలా దూరంలో ఉంటుంది. అమరావతి అందరికీ అనువైన ప్రదేశం అని ఆయన తెలిపారు. అమరావతిలో పునాదులకు ఎక్కువ ఖర్చు చేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని భావిస్తే దర్యాప్తు చేయించండి అని చంద్రబాబు అన్నారు. కావాలనే వైఎస్ఆర్సిపి నేతలు కమిటీల పేరుతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/