వైఎస్ఆర్సిపి నేతలపై చంద్రబాబు ఆగ్రహం
పంచాయతీ ఎన్నికల్లో టిడిపి బలం పెరుగుతుండడంతో వైసీపీ నేతలు అక్రమ కేసులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు..చంద్రబాబు
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు ఏపి పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్సిపి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో టిడిపి మద్దతుదారులకు ప్రజాబలం పెరుగుతుండడంతో వైసీపీ నేతలు అక్రమ అరెస్టులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారని ఆరోపించారు. పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో వైఎస్ఆర్సిపి గూండాల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని తెలిపారు.
ఆవులవారిపాలెంలో అరెస్ట్ చేసిన టిడిపి నేతలను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు కోరారు. పులివెందులలో పంటపొలాలను నాశనం చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్రోసూరులో టిడిపి నేతల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నట్టు తెలిపారు. విధ్వంసాలతో వైఎస్ఆర్సిపి నేతలు రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతున్నా గానీ వైఎస్ఆర్సిపి నేతలకు సిగ్గు రావడం లేదని అన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/