బిజెపి నేతలపై విరుచుకుపడ్డ కొడాలి నాని

ప్రధాని కూడా సతీసమేతంగా తిరుమలకు వెళ్లారా ?…నాని

kodali nani
kodali nani

అమరావతి: డిక్లరేషన్ పై సంతకం పెట్టి, సతీసమేతంగా తిరుమల వేంకటేశ్వరస్వామిని సిఎం జగన్‌ దర్శించుకోవాలన్న బిజెపి నేతల వ్యాఖ్యలపై ఏపి మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అత్యధిక ఓట్లను సాధించిన జగన్ కు సలహా ఇచ్చే స్థాయి బిజెపి నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. ప్రధాని మోడిని భార్యను తీసుకెళ్లి రామాలయంలో పూజలు చేయమని చెప్పండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నోటా ఓట్ల కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న బిజెపి నేతలు మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. నోటా కంటే ఎక్కువ ఓట్లు ఎలా తెచ్చుకోవాలి అనే విషయంపై బిజెపి నేతలు ఆలోచిస్తే బాగుంటుందని హితవు పలికారు.

వైఎస్‌ఆర్‌సిపి లో ఎవరిని ఉంచాలి? ఎవరిని తొలగించాలి? అనే విషయాలను జగన్ కు బిజెపి నేతలు చెప్పాల్సిన అవసరమేముందని నాని ప్రశ్నించారు. ఎవరి పార్టీ వ్యవహారాలు వారు చూసుకుంటే మంచిదని అన్నారు. సోము వీర్రాజు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు అయిన తర్వాత హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని తాము అంటే… ఆయనను పదవి నుంచి తొలగిస్తారా? అని ప్రశ్నించారు. పది మందిని వెంట పెట్టుకెళ్లి అమిత్ షాను, కిషన్ రెడ్డిని తొలగించాలంటే తొలగిస్తారా? అని అడిగారు. తిరుమలలో డిక్లరేషన్ ను తొలగించాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని నాని చెప్పారు.


తాజా తెలంగాణ వార్తల కసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/