అమరావతి రైతుల పాదయాత్ర.. హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ప్రభుత్వం పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు

andhra-pradesh-high-court-rejects-ap-government-petition

అమరావతిః ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న డిమాండ్ తో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు చేపట్టిన పాదయాత్రపై అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు పాదయాత్ర చేస్తున్న రైతులు దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. రైతులు వెంటనే పాదయాత్రను ప్రారంభించుకోవచ్చన్న కోర్టు.. గుర్తింపు కార్డులు ఉన్న వారు మాత్రమే యాత్రలో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాదయాత్రపై ప్రభుత్వం, రైతులు దాఖలు చేసుకున్న పిటిషన్లపై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు యాత్రకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చేది లేదని తేల్చి చెప్పింది.

అమరావతి టూ అరసవెల్లి మహాపాదయాత్ర పేరిట ఇటీవలే ప్రారంభమైన రైతుల పాదయాత్ర డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిలిచిపోయింది. గుర్తింపు కార్డులు చూపాలంటూ రైతులను పోలీసులు నిలువరించడంతో ఈ యాత్ర ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యాత్రను నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం, యాత్రలో పాలుపంచుకునే వారికి మరిన్ని వెసులుబాటులు కల్పించాలంటూ అమరావతి రైతులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు పిటిషన్లను కలిపి మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు తన నిర్ణయాన్ని వెనువెంటనే ప్రకటించేసింది.

అమరావతి రైతుల పాదయాత్రను నిలుపుదల చేయాలన్న ప్రభుత్వ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా యాత్రలో పాలుపంచుకునేవారికి మరిన్ని వెసులుబాటులు కల్పించాలన్న రైతుల పిటిషన్ ను కూడా కోర్టు కొట్టివేసింది. పాదయాత్రకు సంబందించి కోర్టు గతంలొో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే యాత్ర కొనసాగాలని తేల్చి చెప్పింది. అంతేకాకుండా గుర్తింపు కార్డులు ఉన్న రైతులు మాత్రమే యాత్రలో పాల్గొనాలని కూడా కోర్టు చెప్పింది. యాత్రలో పాలుపంచుకునే రైతులకు తక్షణమే గుర్తింపు కార్డులను మంజూరు చేయాలని పోలీసులను ఆదేశించింది. పాదయాత్రకు మద్దతు తెలిపే వారు ఏ రూపంలో అయినా సంఘీభావం తెలపవచ్చని తెలిపింది. యాత్రలో పాలుపంచుకునే రైతులు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే తమను ఆశ్రయించవచ్చని పోలీసులకు కోర్టు సూచించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/