త్వరలో క్యాబ్ సర్వీసుల్లోకి మహీంద్రా
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీదారు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) క్యాబ్ అగ్రిగేటర్, షేర్డ్ మొబిలిటీ సర్వీసుల రంగంలోకి అడుగు పెట్టే కసరత్తులో ఉందని సమాచారం. ప్రధానంగా కార్పొరేట్ల కోసం ‘అలైట్’ అని పిలిచే క్యాబ్ అగ్రిగేటర్ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. వచ్చే రెండు, మూడేళ్లలో ఈ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. దీంతో ఈ రంగంలో కీలక సంస్థలు ఓలా, ఉబర్లకు ప్రత్యక్షంగా గట్టి పోటీ ఇవ్వనుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. క్యాబ్ సర్వీసుల నిర్ణయంతో పాటు, తన మొబిలిటీ వ్యాపారాలన్నింటినీ ఏకం చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. అలైట్, ఎంఅండ్ఎం మెజారిటీ వాటా కలిగిన మేరూ క్యాబ్స్, గ్లైడ్ , ఫస్ట్ ఛాయిస్ తదితర అన్నీ మొబిలిటీ సర్వీసులను ఒకే గొడుగు అలైట్ కిందికి తీసుకురానుంది. ఇందుకోసం ‘అలైట్’ పేరుతో ఒకయాప్ త్వరలోనే విడుదల చేయనుంది. ఈ త్రైమాసికం నుండి దేశవ్యాప్తంగా తమ బ్రాండ్ను పరిచయం చేయనున్నామని మహీంద్రా లాజిస్టిక్స్ సిఇఒ రాంప్రవీణ్ స్వామినాథన్ తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/