నారా లోకేష్ తో ఆనం కుమార్తె కైవల్యా రెడ్డి భేటీ

టీడీపీ మహానాడులో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ తో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఉదయం నెల్లూరు నుంచి ఒంగోలు వచ్చిన కైవల్య.. లోకేష్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు కీలక విషయాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి టీడీపీ తరఫున పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని లోకేష్‌కు ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. లోకేష్‌ ఓకే అంటే ఆమె టీడీపీ కండువా కప్పుకోవడం ఖాయం అంటున్నారు.

నెల్లూరు జిల్లాలో రాజకీయంగా పట్టు ఉన్న కుటుంబాల్లో ఆనం కుటుంబం ఒకటి. ప్రస్తుతం ఆనం రామనారాయణరెడ్డి వెంకటగిరి నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో అంటే 1985లో ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం ఎమ్మెల్యేగా రాపూరు అసెంబ్లీ నుంచి గెలిచి ఎన్టీ రామారావు మంత్రివర్గంలో వివిధ శాఖలకు మంత్రిగా కూడా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆనం రామనారాయణరెడ్డి రాపూరు నుంచే 1999 2004ల్లో రెండుసార్లు అసెంబ్లీకి ఎంపికయ్యారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి కొణిజేటి రోశయ్య కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన జరిగాక ఆయన తెలుగుదేశంలో చేరారు. మళ్లీ 2018లో వైఎస్సార్సీపీలో చేరి వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో రాపూరు నియోజకవర్గం పునర్విభజనలో రద్దు కావడంతో ఆత్మకూరు నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు తాజాగా ఆనం రామనారాయణ రెడ్డి కూతురు కైవల్యా రెడ్డి నారా లోకేష్ తో భేటీ కావడంతో ఆమె టీడీపీలో చేరతారని తెలుస్తోంది.