ఢిల్లీ ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం

కేంద్రంపై ఓ రాష్ట్రం​ ‘పిల్​’ వేయడమా!.. సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కొత్త బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర పర్యావరణ శాఖ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఢిల్లీ సర్కారు పిల్ దాఖలు చేసింది. అయితే, ఓ ప్రభుత్వం పిల్ వేయడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది. సాధారణంగా ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు సామాన్యులు కోర్టును ఆశ్రయించడం కోసం తీసుకొచ్చిన వ్యాజ్యాలు పిల్స్ అని, కానీ, ఇప్పుడు ఓ రాష్ట్ర ప్రభుత్వమే పిల్ వేయడం ఆశ్చర్యంగా అనిపిస్తోందని వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం ఏదైనా తప్పుగా చేస్తోందనిపిస్తే కేంద్రం ఏం చేస్తోందో కోర్టుకు సమాచారమివ్వాలని, కేసును ఫైల్ చేయాలని సూచించింది. దీంతో ప్రభుత్వం పిల్ ను వెనక్కు తీసుకుంది.

రాజధాని ప్రాంతానికి 10 కిలోమీటర్ల పరిధిలో, 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో బొగ్గు విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ నోటిఫికేషన్ లో కేంద్రం మార్పులు చేసిందని ఢిల్లీ ప్రభుత్వం తన పిల్ లో పేర్కొంది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో ఉన్న 11 విద్యుత్ ప్లాంట్ల ద్వారా కాలుష్యం పెరుగుతోందని, పీఎం2.5లో వాటి వాటానే 7 శాతమని పేర్కొంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లలోని కొన్ని ప్లాంట్లు ఫ్లూ గ్యాస్ డీ సల్ఫరైజేషన్ టెక్నాలజీని ఏర్పాటు చేయకపోవడం వల్ల కాలుష్యం పెరుగుతోందని కోర్టుకు వివరించింది. కాలుష్య నియంత్రణపై కేంద్రానికి కనీస పట్టింపు లేదని, తాను చెప్పిన దానికి కట్టుబడి ఉండట్లేదన్న ఢిల్లీ ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అలాగైతే ఏ కేసులో అయితే కేంద్రం కాలుష్య నియంత్రణకు కట్టుబడి ఉంటానని చెప్పిందో అదే కేసుకూ ఈ విషయాన్నీ జోడించాలంటూ ఆదేశించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/