మరోసారి పెరిగిన అమూల్ పాల ధరలు
అమూల్ పాల ధరలు మరోసారి పెరిగాయి. అమూల్ బ్రాండ్ పేరుతో పాలు, పాల ఉత్పత్తులను అమ్ముతున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అమూల్ గోల్డ్, బర్రెపాల ధరను లీటర్ కు రూ. 2 చొప్పున పెంచినట్లు..పెంచిన ధరలు ఆదివారం నుండి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఫ్యాట్ ధరలు పెరగడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చింది.
ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న గుజరాత్లో మినహాయించి దేశవ్యాప్తంగా ఈ పెంపును వర్తింప చేసింది. ఫుల్ క్రీమ్, గేదె పాల ధరలను లీటరుకు రూ.2 పెంచుతున్నట్లు సంస్థ ఎండీ ఆర్ఎస్ సోథి పేర్కొన్నారు. డెయిరీ ఫ్యాట్ ధరలు బాగా పెరిగినట్లు ఎండీ వివరించారు. దీంతో మొన్నటి వరకూ లీటరు రూ.61 ఉండగా, తాజా పెంపుతో ధర రూ.63కు చేరింది. అమూల్ పాల ధరలను పెంచడం ఈ ఏడాదిలో ఇది మూడో సారి. మార్చిలో ఓ సారి పెంచిన అమూల్ రెండు నెలల క్రితం ఆగస్టులో గోల్డ్, శక్తి, తాజా బ్రాండ్ల ధరలను లీటరుకు రూ.2 పెంచింది. అమూల్ తో పాటు మదర్ డెయిరీ కూడా పాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఫుల్ క్రీమ్, ఆవు పాల ధరలు లీటరకు రూ.2 పెంచుతున్నట్లు తెలిపారు.