ఈరోజు అమిత్ షా అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం
న్యూఢిల్లీః నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నతాధికారుల సమావేశం జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు సమావేశంలో పాల్గొననున్నారు. దేశంలోని అంతర్గత భద్రతా పరిస్థితి, ఉగ్రవాద ముప్పులు, బెదిరింపుల అంశాలపై చర్చలు జరుపనున్నారు. కేంద్ర, రాష్ట్ర సంస్థల మధ్య సమన్వయం అవసరమని అమిత్ షా అభిప్రాయపడుతున్నారు. అలాగే.. దేశంలో పటిష్టమైన అంతర్గత భద్రత, గూఢచార సేకరణ నెట్ వర్స్, ఇతర అంశాలపై హోంమంత్రి సమీక్షించనున్నారు.
టెర్రరిజం, గ్లోబల్ టెర్రర్ గ్రూపుల బెదిరింపులు, టెర్రర్ ఫైనాన్సింగ్, నార్కో-టెర్రరిజం, ఆర్గనైజ్డ్ క్రైమ్-టెర్రర్ నెక్సస్, సైబర్స్పేస్ను అక్రమంగా ఉపయోగించడం, విదేశీ టెర్రరిస్టు యోధుల కదలిక వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. ఎప్పటికప్పుడు మారుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర భద్రతా సంస్థల మధ్య మెరుగైన సమన్వయం ఉండాలని అమిత్ అన్నారు. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా నిఘా సంబంధిత అంశాలకు సంబంధించిన ఇతర సీనియర్ అధికారులు హాజరుకానున్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/